నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య కేసు దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. అ కేసు ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్వర్మ మర్డర్ పేరిట సినిమా తీస్తున్నారు. మర్డర్ సినిమా చిత్రీకరణను ఆపాలంటూ.. మృతుడు ప్రణయ్ భార్య, మృతి చెందిన ఏ1 ముద్దాయి కూతురు, కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన పెరుమాల్ల అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్ దావాను దాఖలు చేశారు. హత్య కేసు విచారణ దశలో ఉందని, కల్పిత కథతో ఉన్న సినిమా విడుదల అయితే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే సినిమాను నిలుపుదల చేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి.. ప్రతివాదులు దర్శకుడు రాంగోపాల్వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులను జారీ చేస్తూ మధ్యంతర పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు నోటీసులను ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా మంగళవారం జారీ చేసినట్లు ఫిర్యాదుదారు న్యాయవాది తెలిపారు. మరోవైపు రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న తమపై మర్డర్ పేరుతో కల్పిత కథతో సినిమా రూపొందించి తమ జీవితాలతో చెలగాటమాడటం సరికాదంటూ ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి పేర్కొన్నట్లు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఓ మెసేజ్ వైరల్ అయింది. దీనిపై వారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm