హైదరాబాద్ : విజయవాడ స్వర్ణా ఫ్యాలెస్లోని కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు పీఎంఓ ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ ఘటన గురించి తెలియగానే ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా తోడుగా ఉంటామని తెలిపారు. మరోవైపు చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై జేసీ ఎల్.శివశంకర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.గీతాబాయి, ఆర్ఎఫ్వో ఉదయ్కుమార్, విద్యుత్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm