హైదరాబాద్ : డీఎంకే అగ్రనేత కనిమొళికి విమానాశ్రయంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో హిందీలో మాట్లాడుతున్న సీఐఎస్ఎఫ్ అధికారిణితో మీరు తమిళంలో గానీ, ఇంగ్లీష్ లో గానీ మాట్లాడండి... నాకు అర్థమవుతుంది అని కనిమొళి పేర్కొనగా, ఆ అధికారిణి... మీరు భారతీయులు కాదా? అంటూ ప్రశ్నించింది. ఆ మహిళా అధికారి వైఖరితో కనిమొళి ఎంతో వేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హిందీ మాట్లాడితేనే భారతీయులా? ఇది ఎప్పటి నుంచి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై సీఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందించింది. కనిమొళికి ఎదురైన పరిస్థితిని గుర్తించామని, ఆమె ప్రయాణ వివరాలు, ఎయిర్ పోర్టు పేరు, లొకేషన్, ప్రయాణ తేదీ, సమయం ఇత్యాది వివరాలు పంపిస్తే కారకులపై చర్యలు తీసుకుంటామని సీఐఎస్ఎఫ్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభమైందని, ప్రత్యేకించి ఓ భాష గురించి అడగడం తమ విధానాల్లో భాగం కాదని స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm