హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీతో కేసీఆర్ మాట్లాడుతూ... కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గతంలో మనకు కరోనా వ్యాప్తి వంటి అనుభవం లేదని, ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని ఆయన చెప్పారు. గతంలో అనేక వైరస్లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని, కరోనా వంటి వైరస్ రాలేదని కేసీఆర్ చెప్పారు. కొవిడ్-19 వంటి వైరస్లు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, ఏ విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యుల సంఖ్యను పెంచడం, వైద్య కాలేజీల ఏర్పాటు వంటి వాటిపై ఆలోచించాలని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి వైరస్ల వంటివి ఎన్ని వచ్చినా తట్టుకునేలా వైద్య రంగం తయారుకావాలని కేసీఆర్ చెప్పారు. ఇందుకు మోడీ చొరవతీసుకోవాలని తెలిపారు. దీని తగ్గట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని ఆయన చెప్పుకొచ్చారు. పడకలు, మందులు, సామగ్రిని సిద్ధం ఉంచామన్నారు. వైద్య నిపుణుల సలహాలు పాటిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. (తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కేసులు)
Mon Jan 19, 2015 06:51 pm