హైదరాబాద్ : థాయ్లాండ్ పార్లమెంట్లో సిగ్గుచేటైన ఘటన చోటుచేసుకుంది. థాయ్లాండ్ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సమయంలో అధికార పార్టీ ఎంపీ రోన్నతెప్ అనువాత్ నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు. ఏకంగా పది నిమిషాలపాటు ఆయన నీలి చిత్రాలను స్క్రోల్ చేసినట్లు వారు గుర్తించారు. ఓ అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, నీలి చిత్రాలు చూస్తున్న ఎంపీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ ఫొటోలను తీశారు. అయితే పార్లమెంట్లో తాను నీలి చిత్రాలను చూసినట్లు విలేకరుల ముందు ఆయన ఒప్పుకున్నారు. అయితే పార్లమెంటులో కూర్చుని అలాంటి చిత్రాలను ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే ఆయన ఒక విచిత్రమైన కారణం చెప్పారు. ఆ చిత్రాల్లోని మహిళ సాయం చేయాలని ప్రాదేయపడుతున్నదని.. అది నిజమో, అబద్ధమో తెలుసుకునేందుకే వాటిని పరీక్షగా చూశానని తెలిపారు. తాను ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించానని, కొంతమంది గ్యాంగ్స్టర్లు ఆమెను వేధింపులకు గురిచేస్తూ ఫొటోలు తీస్తున్నట్లుగా ఆ ఫొటోల్లో ఉన్నదని అనువాత్ చెప్పారు. అందుకే ఆమె ఏమైనా ప్రమాదంలో ఉందేమోనని ఆ ఫొటోలను పరిశీలించానని తెలిపారు. ఆ తర్వాత ఆ ఫొటోలను తన ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm