చెన్నై: కరోనా వైరస్ బారినపడి చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకు మరింత మెరుగుపడుతున్నది. ఈ విషయాన్ని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాకు తెలిపారు. శుక్రవారం నుంచి ఆయన ఆహారం కూడా తీసుకుంటున్నారని ఎస్పీ చరణ్ చెప్పారు. అంతేగాక రోజులో 15-20 నిమిషాలు వైద్యుల సాయంతో లేచి కూర్చొంటున్నారని తెలిపారు. అయితే, ఇంకా ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారని చరణ్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ఇతర ఇన్ఫెక్షన్లు లేవని, అయితే ఆయన ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ కొనసాగిస్తున్నారని, ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5న బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.
Mon Jan 19, 2015 06:51 pm