మహబూబ్నగర్: సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నంచి ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుబి వాగులో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన జడ్చర్ల మండలంలోని లింగంపేటలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన యువకుడు అఫ్రోజ్(22) లింగంపేట దుందుబి వాగుపై ఉన్న చెక్ డ్యాంలో శనివారం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తూ నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లొద్దని, పరివాహకప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm