హైదరాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలోని భాగ్యనగర్లో కుళ్లిన మృతదేహం లభించింది. కుళ్లిపోయిన మృతదేహాన్ని కుక్కులు పీక్కుతిన్నాయి. మృతదేహం చేతిని కుక్కులు బయటకు తీసుకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఎడపల్లి మండలం జమిలం గ్రామానికి చెందిన యాదగిరి (55) కొన్ని నెలలుగా భాగ్యనగర్ కాలనీలో ఒక్కడే అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తుండగానే మరణించి వుంటాడని, ఎవరూ గుర్తించకపోవడంతో శవం కుళ్లిపోయివుంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శవం కుళ్లిపోవడంతో వీదికుక్కులు ఇంట్లోకి వెళ్లి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. మృతుడి చేతిని ఒక కుక్క బయటకు తీసుకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారని తెలిపారు. మృతుడి ఇంట్లో వెతుకగా ఆయన ఎడపల్లి మండలం జమిలంవాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm