హైదరాబాద్ : దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందా? అందరూ ఎలాంటి కష్టాలూ లేకుండా హాయిగా ఉన్నారా అంటే... దీనికి సమాధానం లేరనే చెప్పాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా... నేరుడుపల్లి గ్రామ ప్రజల కష్టాలు కళ్లకు కడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుల్లోనే ఈ ఊరు ఉంది. వర్షాకాలం రాగానే... గోదావరి ఉప నది అయిన మాలిగూడ... ఇక్కడ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. సప్త సముద్రాలు ఈదిన వాళ్లు సైతం... ప్రవాహ జోరు ముందు నిలబడటం కష్టం. అలాంటిది... అంగన్వాడీ వర్కరైన హేమలత సిసా... ఆ ఉద్ధృతమైన నదిలో స్థానికులతో కలిసి... ముందుకెళ్లింది. ఆమె మాత్రమే కాదు... ఆ ఊరి ప్రజలంతా... నదిని దాటేందుకు ఇలా... ప్లాస్టిక్ బిందెలను నడుములకు చుట్టుకొని... ఉద్ధృతమైన ప్రవాహంలో ముందుకెళ్తారు. పొరపాటున కాళ్లు జారితే... ప్రవాహంలో కొట్టుకుపోవడమేగా.... ఎంత దయనీయమంటే... నేరుడుమల్లికి వెళ్లేందుకు బోట్లు కూడా లేవు. ఎవరైనా సరే ఈదాల్సిందే. దానికంటే ముందు... కిలోమీటర్ వరకూ... కొండపై ఉన్న అడవిలో నడవాల్సి ఉంటుంది. స్థానికులతోపాటూ... అంగన్ వాడీ వర్కర్లు ఇలాంటి సాహసాలు చేస్తూ... పనిచేయాల్సి వస్తోంది. ప్రస్తుత వీడియోలో హేమలత... కాళ్లకు చెప్పులు కూడా వేసుకునే ఛాన్స్ లేదు. నది దాటాక వేసుకోవడానికి ఓ జత బట్టలను ఆమె... ప్లాస్టిక్ బ్యాగులో ఉంచుకుంది. గత పదేళ్లుగా తాను ఇలాగే పనిచేస్తున్నట్లు ఆమె తెలిపింది. మన దేశంలోని పల్లెల్లో అభివృద్ధి ఏ మాత్రం ఉందో చెప్పేందుకు ఇలాంటి ఎన్నో ఘటనలున్నాయి. హేమలత... చాలా సందర్భాల్లో... వర్షాకాలంలో... నేరుడుపల్లి గ్రామంలోనే ఉండిపోతుంది. మాటిమాటికీ నదిని దాటడం కంటే... అదే బెటరని అలా చేస్తోంది. ఆమెకు ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. వారాంతాల్లో వారి కోసం ఇంటికి వెళ్తుంది. ఆ నదిని దాటుతూ చాలా మంది కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. అందుకే మేం రోజూ నదిని దాటేందుకు ప్రయత్నించం. రాత్రివేళ పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది అని ఆమె తెలిపింది. నేరుడుపల్లిలో... దాదాపు 400 మంది నివసిస్తున్నారు. ఐదుగురు గర్భిణులు, నలుగురు కొత్త తల్లులు, 27 మంది స్కూల్ పిల్లలకు సేవలు అందిస్తోంది హేమలత. దగ్గర్లోని స్వాపల్లి గ్రామంలో పనిచేస్తున్న 37 ఏళ్ల ప్రమీలా పెల్మాల్ కూడా 9 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కరోనా సమయంలో వాళ్ల కష్టాలు మరింత పెరిగాయి. అక్కడ కనీసం ఫోన్లు కూడా పనిచెయ్యవు. ఈ వీడియోని నెటిజన్లకు షేర్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చాలా దయనీయ పరిస్థితి ఇదని కొందరు అంటుంటే... మరికొంత మంది తమ చిన్నప్పుడు తాము ఇలాగే చేయాల్సి వచ్చేదనీ... ఇప్పటికీ పరిస్థితులు మారకపోవడం విచారకరమని అంటున్నారు. పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వాలు మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని ఇంకొందరు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm