హైదరాబాద్ : సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ఇవాళ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా పరిస్థితులపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్ రేట్ 99.4 శాతంగా ఉందని...0.6 శాతం మాత్రమే మరణాల రేట్ ఉందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయని..దీనిని దృష్టిలో ఉంచుకోని సిద్దిపేట మెడికల్ కళాశాలకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి తెలిపారు. 24/7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 405 బెడ్స్ కోసం పని చేసేలా రూ.61 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోకూడదని సూచించారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని తెలిపారు. కరోనా లక్షణాలున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm