హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో దీపిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. అఖిల్ కిడ్నాప్ చేసి ఉంటాడని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంటలు గడిచినా బిడ్డ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ కు చెందిన ఖలీల్ అలియాస్ అఖిల్ - దీపిక ప్రేమించుకున్నారు. 2016లో ఆర్యసమాజ్ లో వివాహాం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దీపిక - అఖిల్ కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే లవ్ మ్యారేజ్ పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో దీపికను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. వీరి విడాకులకుకి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం దీపిక - అఖిల్ కోర్టుకు హాజరయ్యారు. నిన్న(ఆదివారం) సాయంత్రం అక్కతో కలిసి దీపిక షాపింగ్ వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకోబోతే తనను తోసేశారని దీపిక సోదరి చెబుతోంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పాట్ కు వెళ్లిన పోలీసులు స్థానికుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగానూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, త్వరగా తమ బిడ్డ ఆచూకీ తెలపాలని కుటుంబసభ్యులు పోలీసుల్ని కన్నీరుమున్నీరై వేడుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm