హైదరాబాద్: ఎంబీఏ, ఎసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షకు 58,452 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికోసం హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఐసెట్ను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది. పరీక్ష రెండురోజులపాటు రెండు విడుతల్లో జరగనుంది. ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. అయితే రేపు ఉదయం మాత్రమే పరీక్ష ఉంటుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసెట్ కన్వీనర్ తెలిపారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm