హైదరాబాద్: ‘మీ పని తీరు బాగా లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ప్రజల్లోకి వెళ్లండి. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సొంత పార్టీ కార్పొరేటర్లు కొంతమందికి సూచించారు. గ్రేటర్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ సందర్భంగా కార్పొరేటర్ల పనితీరు గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని, వారంతా తమ తీరు మార్చుకోవాలని మంత్రి సూచించినట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న అధికార పార్టీ ఇప్పటికే ఐదు సర్వేలు నిర్వహించినట్టు తెలిసింది. ప్రభుత్వ పనితీరు, స్థానిక కార్పొరేటర్ పనితీరు, టీఆర్ఎస్ పట్ల ఆదరణ తదితర అంశాలపై ప్రజల అభిప్రాయం సేకరించినట్టు సమాచారం. 2016 ఎన్నికల్లో గ్రేటర్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో కార్పొరేటర్ చేరడంతో ఆ సంఖ్య 101కి పెరిగింది. ఇందులో 15 మంది పనితీరుపై స్థానికులలో అసంతృప్తి ఉందని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఆ 15 మందితో వ్యక్తిగతంగా మాట్లాడి సుతిమెత్తగా హెచ్చరించినట్టు తెలిసింది. వాస్తవంగా పనితీరు బాగాలేని కార్పొరేటర్ల సంఖ్య 15 కంటే ఎక్కువే ఉన్నప్పటికీ... ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో సంఖ్య తక్కువ చేసి చెప్పారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదిలా ఉంటే... అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కినట్టే, తమకూ మరోసారి చాన్స్ వస్తుందని భావించిన కార్పొరేటర్లలో కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో టెన్షన్ పట్టుకుంది. పార్టీ నాయకులు మాత్రం అవకాశం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm