ఢిల్లీ: అక్టోబరు 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ అఫిడవిట్ సమర్పించింది. ఈ ఏడాది వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని.. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు అఫిడవిట్లో తెలిపింది. కొవిడ్ సహా అన్ని ప్రొటోకాల్స్ పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్లు వ్యయం అయినట్లు తెలిపింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని 20 మంది యూపీఎస్సీ ఆశావహులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm