హైదరాబాద్: సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. హత్య కేసులో ప్రధాన నిందితులను గచ్చిబౌలి పోలీసులు రెండోరోజు విచారించారు. గురువారం లక్ష్మారెడ్డి, యుగేందర్రెడ్డిని ప్రశ్నించి హత్యకు ముందు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. తొలిరోజు లక్ష్మారెడ్డి నుంచి హత్యకు సంబంధించిన పలు వివరాలను రాబట్టారు. సుఫారీ ముఠాతో ఒప్పందంపై యుగేందర్రెడ్డిని ప్రశ్నించారు. కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు ఆరురోజులపాటు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు విచారణలో లక్ష్మారెడ్డి పోలీసులకు పలు సంచలన విషయాలు తెలిపారు. ప్రేమ విషయం తెలిసి అవంతిని ఇంట్లో నిర్బంధించామని అయినా తప్పించుకొని వెళ్లి వివాహం చేసుకుందని చెప్పాడు. పరువుపోవడంతో కాలనీలో తలెత్తుకొని తిరగలేకపోయామని అందుకే హేమంత్ను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది. హేమంత్ను కిడ్నాప్ చేసి హత్యచేసిన ప్రాంతాల్లో నిందితులతో పోలీసులు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm