ధవళేశ్వరం: విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి మిథైల్ ఆల్కాహాల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైంది. బ్యాటరీలో షార్ట్సర్క్యూట్ కారణంగా ట్యాంకర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ లారీని వదిలి పరారయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను సిబ్బందితో హుటాహుటిన ట్రాఫిక్ మళ్లించారు. మిథైల్ ఆల్కాహాల్కు పేలుడు స్వభావం ఉంటుందని, ట్యాంకర్ పేలితే 2కి.మీల పరిధి వరకు పేలుడు ప్రభావం ఉంటుందని సీఐ తెలిపారు. రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను యథావిథిగా పునరుద్ధరించారు.
Mon Jan 19, 2015 06:51 pm