హైదరాబాద్ : దేశంలో తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్, డాక్టర్ విజయలక్ష్మి రమణన్ మరణించారు. 96 ఏళ్ల వయసు ఉన్న ఆమె వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. 1924 ఫ్రిబ్రవరిలో పుట్టిన ఆమె వైద్య విద్య చదివారు. గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ కూడా చేసిన ఆమె 1955లో తన భర్త ప్రోత్సాహంతో ఆర్మీలో చేరారు. ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్లో రిక్రూట్ అయిన ఆమె తన సర్వీస్ ముగిశాక ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. భారత వాయుసేన (IAF)లో తొలి మహిళా ఆఫీసర్గా రికార్డ్ సృష్టించారు. 24 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసిన విజయలక్ష్మి 1979లో వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్లో విజయలక్ష్మిని అంతా ఆఫీసర్ 4971 అని పిలిచేవారు. అంతా మగవాళ్లే ఉన్న వాయుసేనలో ఏకైక మహిళగా వారికి దీటుగా పని చేసేవారు. ఎప్పుడైనా మగవాళ్లతో పని చేయడం పట్ల భయపడ్డారా అని గతంలో ఓ డాక్యుమెంటరీలో ప్రశ్నించగా.. 'అప్పటి వరకు ఎప్పుడూ నేను మగవాళ్లతో కలిసి పని చేయలేదు. దాంటో మొదట్లో కొంచెం భయపడిన మాట వాస్తవమే. అయితే జీవితంలో దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది. ఆ ధైర్యంతో మగవాళ్లతో పోటీగా పనిచేసేదాన్ని'అని చెప్పారు. తన భర్త కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అని, ఆయన ప్రోత్సాహంతోనే తాను సైన్యంలో చేరానని అందులో తెలిపారు. తాను సర్వీస్లో ఉండగా ఆర్మీలో పది, 20 మంది వరకు ఆడవాళ్లు ఉండేవారని, ఎయిర్ ఫోర్స్లో మాత్రం తానే ఏకైక మహిళా ఆఫీసర్నని, అయినప్పటికీ ఎటువంటి వివక్ష తాను ఎదుర్కోలేదని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm