హైదరాబాద్: ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా తన సహాయ సహకారాలను పాకిస్థాన్ అందిస్తోంది. ఆయుధాలను సైతం డ్రోన్లతో అందించడంతో పాటు మన ఆర్మీ కదలికలను సైతం డ్రోన్ల సహకారంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాక్ కు చెందిన పలు డ్రోన్లను మన సైనికులు కూల్చేశారు. తాజాగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గుర్తించారు. వెంటనే దాన్ని కూల్చేశారు. వివరాలలోకి వెళ్లితే... జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఉదయం 8 గంటల సమయంలో ఈ డ్రోన్ ను భారత్ సైనికులు కూల్చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ.. పాక్ చర్యలను అడ్డుకోవడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. చలికాలంలో ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుందని... అందుకే ఈలోగానే ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఏదిఏమైనా ఇలాంటి చర్యలను భారత్ సైన్యం ఎప్పటికప్పుడు అడ్డుకుంటుదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm