వనపర్తి : గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో పండుగ పూట విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఏడాది కిందట ఇంటి యజమాని కోమటిచెవ్వ నరసింహ మృతి చెందాడు. శనివారం సంవత్సరీకం కావడంతో నలుగురు కొడుకులు, కోడళ్లు వారి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చారు. కార్యక్రమం అనంతరం రాత్రి భోజనాలు చేసి అందరూ కలిసి ఒకే గదిలో సభ్యులు పడుకున్నారు. పాత ఇల్లు కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసింది. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో పైకప్పు ఒక్కసారిగా కూలి వారిపై పడింది. గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకి అక్కడిక్కడే మృతి చెందారు.
మణెమ్మ కుమారుడు కుమారస్వామితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో వెలికి తీశారు. క్షతగాత్రుల హాహాకారాలు, బంధువుల రోదనలు సంఘటనా స్థలంలో మిన్నంటాయి. దసరా పండుగకు గ్రామస్తులు సిద్ధమవుతున్న వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఇన్చార్జి, నాగర్ కర్నూల్ ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్ఐ రామన్ గౌడ్, స్థానిక గోపాలపేట మండల తహశీల్దార్ నరేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 25,2020 11:11AM