ఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గురువారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రూ. 1,195 కోట్లు నష్టం వాటినట్లుగా సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రయాణాలపై పరిమితులు కొనసాగడమే ఇందుకు కారణంగా పేర్కొంది. కొవిడ్-19 సంబంధిత ప్రయాణ పరిమితుల వల్ల ప్రపంచ విమానయాన పరిశ్రమ బాగా దెబ్బతిందంది. ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ తాము నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా తెలిపారు. ఒక్కసారి తాము 100 శాతం సామర్థ్యానికి తిరిగి వచ్చాక అతి తక్కువ యూనిట్ ఖర్చులు, బలమైన ఉత్పత్తి, మరింత సమర్థవంతమైన నెట్వర్క్తో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. కంపెనీ రెండవ త్రైమాసిక నికర నష్టం రూ. 1,195 కోట్లుగా ఉందని కాగా గతేడాది ఇదే కాలానికి రూ. 1,066 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దేశీయ మార్కెట్లో ఆధిపత్యం వహించిన ఇండిగో సెప్టెంబరు నాటికి తన మొత్తం అప్పు రూ. 25,419.4 కోట్లు అని గత సంవత్సరంతో పోలిస్తే ఇది 28 శాతం పెరిగిందన్నారు. ప్రయాణ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 66 శాతం తగ్గి రూ. 2,741 కోట్లకు చేరుకుందని ఎయిర్లైన్స్ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm