హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రకటన ఉంటుందని రజనీ స్వయంగా వెల్లడించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాదరణ తమకే ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడులో ఇకపై ఆశ్చర్యపరిచే అద్భుతాలు జరుగుతాయని, కులమతాలకు అతీతంగా నీతిమంతమైన ఆధ్యాత్మిక రాజకీయాలు, పాలన తమ నుంచి ఆశించవచ్చని తెలిపారు. మారుస్తాం... అన్నింటినీ మారుస్తాం అంటూ తలైవా తన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ మార్పు రాదని ఉద్ఘాటించారు. తమిళ ప్రజల తలరాతల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేసేందుకైనా తాను సిద్ధమేనని, తమిళ ప్రజల కోసం సంతోషంగా ప్రాణాలు ఇచ్చేస్తానని పేర్కొన్నారు. వైద్యులు వద్దంటున్నా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యటించాలని భావించినా, కరోనా వ్యాప్తి కారణంగా వీలుపడలేదని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm