హైదరాబాద్ : విజయవాడలోని గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు బ్యూటీషియన్ సురేఖను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా గుడివాడలో డీఎస్పీ సత్యానందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎస్ఐ విజయ్కుమార్ ఆత్మహత్య వివరాలు వెల్లడించారు. సబ్ ఇన్స్పెక్టర్ పిల్లి విజయ్కుమార్(34)కు రెండున్నర నెలల క్రితం ఏలూరుకు చెందిన యువతితో వివాహమైంది. పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఎస్ఐ ఒక్కడే అద్దెకుంటున్నాడు. అతడికి హనుమాన్ జంక్షన్లో పని చేస్తున్న సమయంలో సురేఖ అనే బ్యూటీషియన్తో పరిచయం ఏర్పడింది. విజయ్ కుమార్ భార్యను కాపురానికి తీసుకురావద్దని, తనతోనే ఉండాలని సురేఖ తరచూ గొడవ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో సురేఖ.. విజయ్కుమార్ అపార్ట్మెంట్కు వెళ్లి అతనితో ఇదే అంశంపై గట్టిగా ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. నీవు నీ భార్యకు విడాకులు ఇవ్వని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్లో నీవే కారణమని తెలుపుతాను అనిహెచ్చరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎస్ఐ తన గదిలోని ఫ్యాన్ హుక్కు టవల్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm