హైదరాబాద్: ఒకవైపు కేటీఆర్ను తెలంగాణకు కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాధికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తిస్తుందని బిజెపి నేత విజయశాంతి అన్నారు. మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్లను కేసీఆర్ గారు ఆకాశానికెత్తేశారు. ఇన్నాళ్లూ కమీషన్ల రూపంలోనో... మరో రూపంలోనో తనను కనికరించిన ఆ ప్రాజెక్టుల వద్ద ఆయన పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తే... కొడుక్కి పీఠం అప్పగించి తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా... లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాప పరిహారంగా నదీమ తల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆయన తీరు కనిపిస్తోంది. రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల సారుకు ఎంత చిత్తశుద్ది ఉందంటే... ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే సమయమే లేకుండె పాపం అని విజయశాంతి తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm