హైదరాబాద్: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్య్యుఎస్లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్తో కలిపి 60 శాతానికి రిజర్వేషన్లు చేరాయి. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన 10% రిజర్వేషన్లను కేంద్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని, అన్ని కోర్సులకు అమలయ్యేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm