హైదరాబాద్ : పోడుసాగు దారులకు పట్టాలివ్వాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మంచి కంటి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గడచిన ఐదేండ్ల కాలంలో పోడు సాగు దారులకు ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సమస్యను స్వయంగా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యరని విమర్శించారు. ఎన్నికలప్పుడే పోడు సాగుదారుల సమస్యను మాట్లాడడం కేసీఆర్కు అలవాటుగా మారిందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన వారు వేలల్లో ఉంటే నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మించడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఈరోజు.. మార్కెట్ యార్డు నుండి ఉదయం 11 గంటలకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ప్రదర్శన ప్రారంభమైంది. లక్ష్మీదేవి పల్లి మండలం మార్కెట్ యార్డ్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది.
Mon Jan 19, 2015 06:51 pm