హైదరాబాద్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అడ్డంకులు తొలగించిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా మార్చారు. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్ధం కానందున రీషెడ్యూల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అంశంపై చర్చించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లడంపై ఎస్ఈసీ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుపడింది.
Mon Jan 19, 2015 06:51 pm