హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు అసదుద్దీన్ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి అసదుద్దీన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్ష్యులు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. షబ్బీర్ అలీపై దాడిలో అసదుద్దీన్ పాత్ర ఉందని కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో అసదుద్దీన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అసదుద్దీన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు..
Mon Jan 19, 2015 06:51 pm