హైదరాబాద్ : సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, సీపీఐ(ఎంఎల్) తదితర రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులతో 2021 జనవరి 24న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా చేస్తున్న భూసేకరణను తక్షణమే ఆపివేయాలని సమావేశం తీర్మానం చేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని 17 గ్రామాలు, 5 తండాల నుండి 12,635 ఎకరాల భూమిని సేకరించి నిమ్జ్ (జాతీయ పెట్టుబడి, తయారీ రంగ సముదాయం)ను నెలకొల్పాలనే ప్రతిపాదనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం అన్ని రకాల చట్టాలను, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నది. మరోవైపు ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో 19,333 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకుంటున్నది.
తాము సేకరిస్తున్నదాంట్లో అత్యధిక భాగం బీడు భూములే అని ప్రభుత్వం బుకాయిస్తున్నది. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి. సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి. జామ తోటలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఈ భూముల వల్ల ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నారు. ఇలాటి భూములను ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా తీసుకోవడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.
సంగారెడ్డి జిల్లాలో కేవలం ఒకరోజు ముందు డప్పు చాటింపు వేసేదాకా ప్రజలకు విషయం తెలియదు. పర్యావరణ నివేదిక తెలుగులో ఇవ్వలేదు. పోలీస్ పికెట్ పెట్టి ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా గ్రామాల్లో నిర్భంధించారు. అయినా వెరవక ముందుకు కదిలినవారిపై లాఠీచార్జ్ చేసారు. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసారు. హాజరైనవారిలో ఎక్కువమంది భూసేకరణను వ్యతిరేకించడం గమనార్హం. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాలు, తండాల నుండి 30 తీర్మానాలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. అప్రజాస్వామికంగా, ప్రజలను అణచివేసి, అక్కడకు రాకుండా అడ్డుకుని బహిరంగ విచారణను తూతూమంత్రంగా జరిపారు. ఇప్పటికే సేకరించిన 12,635 ఎకరాల భూమిలో పరిశ్రమలకు వాడింది కేవలం 6,434 ఎకరాలు మాత్రమే. మిగతా భూమి హరితహారం, గృహవసతి వంటి వాటికి వాడుతామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ఏటా మూడు పంటలు పండే పచ్చని భూములను కాజేసి హరితహారం అనడం హాస్యాస్పదం, అమానవీయం. దీనిని అఖిలపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది.
ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి, కోర్టుల తీర్పులకు విరుద్దంగా, జీవోల ద్వారా బలవంతంగా రైతుల నుండి భూమి గుంజుకుంటున్నది. రైతులు అభ్యంతరం తెలిపినప్పుడు అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ, అక్రమ అరెస్టులను ఆపాలని అఖిల పక్షం సమావేశం ప్రభుత్వాన్ని చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2021 06:08PM