హైదరాబాద్: ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని లేదు. ఆస్తి, అంతస్తు అక్కర్లేదు. మనసుకు నచ్చితే చాలు. అది చేసే మాయ ముందు ఈ కట్టుబాట్లు, అంతరాలు, ఆచరవ్యవహరాలు తేలి పోతాయి. కేవలం ప్రేమ మాత్రమే మిగులుతుంది. దానికి ఎల్లలు ఉండవు.. దూరభారాన్ని పట్టించుకోకుండా.. సరిహద్దులు కూడా దాటుతుంది. కావాల్సింది రెండు మనసుల్లో నిజమైన ప్రేమ. ఓ ప్రియుడికి ఎయిడ్స్ నిర్ధారణ అయినా అతనితోనే జీవించాలని నిర్ణయించుకున్న ప్రియురాలు వివాహం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంల కన్నియకుమారి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక నాగర్కోయిల్లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువు తోంది. రెండు రోజులుగా కుమార్తె అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు నాగర్కోయిల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో, అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్ను ఆ బాలిక ప్రేమించినట్లు తెలిసింది. వీరిద్దరు తల్లిదండ్రులకు తెలియకుండా కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్కు ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు కూడా విచారణలో తేలింది. దీంతో, కోవైకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికి ఎయిడ్స్ ఉన్న విషయం తెలిసినా, అతనిని వివాహం చేసుకున్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా, బాలిక మైనర్ కావడంతో, ఈ వ్యవహారంపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ చేయడాన్ని అడ్డుకున్న బాలిక తనను అరెస్ట్ చేయాలని రోడ్డుపై భైఠాయించింది. ఆమెకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోనని పోలీసులు, ఆమెను పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm