హైదరాబాద్: సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బోరబండలోని తన ఇంటి సమీపంలో ఫిరోజ్ (45)పై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని రినోవా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గతంలో రౌడీ షీటర్ వాహిద్ కేసులో ఫిరోజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఫిరోజ్ కళ్లలో కారం కొట్టి దుండగులు కత్తులతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫిరోజ్పై భూ కబ్జా ఆరోపణలతో పాటు పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిరోజ్ హత్యకు పాత కక్షలు ఏమైనా కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిరోజ్ మరణంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm