హైదరాబాద్ : ఓ యువతి ప్రేమ విఫలమయిందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన తుడుం శిరీష అనే యువతి తన తల్లితో కలిసి ఉంటోంది. తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించగా, తల్లి కూలి పనులు చేసుకుంటూ శిరీషను పోషిస్తోంది. శిరీష హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం వరంగల్ నగరంలోని ఏనుమాముల ఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన మర్రి కల్యాణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని శిరీష తన తల్లికి చెప్పింది. తన కూతురి ప్రేమ పెళ్లికి తల్లి సరేనంది కూడా. అయితే కల్యాణ్ ఇంట్లో మాత్రం వీరి ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పారు. దీంతో శిరీష మనస్తాపానికి గురయింది. శుక్రవారం ఉదయం తల్లి కూలి పనులకు వెళ్లగా, శిరీష పురుగుల మందు తాగి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న శిరీషను గమనించిన స్థానికులు, విషయాన్ని ఆమె తల్లికి చెప్పారు. దీంతో ఆమె 108 కు సమాచారం అందించింది. చికిత్స పొందుతూనే శనివారం శిరీష మృతిచెందింది. కాగా, తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm