శ్రీనగర్: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు సంవత్సరాలైన ఒక మహిళ భర్త వేధింపులు భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి వచ్చారు. మహిళ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించిన అనంతరం ఆగ్రహంతో ఆ ఇంటికి నిప్పుపెట్టారు. మరోవైపు పోలీసులు ఇరు కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. భార్యను వేధించి ఆమె మరణానికి కారణమైన భర్తను అరెస్ట్ చేశారు. అలాగే అత్త వారి ఇంటికి నిప్పుపెట్టిన మహిళ సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఇతర కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm