ఉప్పల్ : అందరినీ నమ్మించి చిట్టీల వ్యాపారాన్ని చేపట్టి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసింది. చివరకు డబ్బులు చెల్లించకపోగా.. రాత్రికి రాత్రే ఇంటిని అమ్మేసుకొని పరారైంది. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో జరిగింది. బాధితులు సోమవారం ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్లోని బీరప్పగడ్డలో నివసించే కడారి రమాదేవి(55) చిట్టీల వ్యాపారి. తన కుమారుడు నవీన్, కుమార్తె స్వాతితో కలిసి చిట్టీల దందా సాగించింది. ఈ క్రమంలో రూ.50 వేల నుంచి రూ.లక్షల చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసింది. బ్యాంకు కాలనీకి చెందిన ఎండీ మన్నన్తోపాటు పలువురు చిట్టీలను వేశారు. రూ.లక్షల్లో నగదు చేబదులు ఇచ్చారు. కూతురు వివాహం పేరిట.. డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చింది. మూడు రోజుల క్రితం తన ఇంటిని అమ్మేసి ఇళ్లు ఖాళీ చేసి పరారైంది. రమాదేవి తమను రూ.కోట్లల్లో మోసం చేసిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm