న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. 879 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కు చేరగా.. మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10,85,33,085 డోసులు వేసినట్లు వివరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు తోడు రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్ట్లు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 14,00,122 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 25,92,07,108 శాంపిల్స్ పరిశీలించినట్లు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm