హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి తన వికృతరూపం దాలుస్తున్న తరుణంలో డెన్మార్క్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా వినియోగాన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే పలు ఐరోపా దేశాలు తాత్కాలికంగా ఈ టీకా వినియోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థలు సైతం ఈ టీకా వినియోగాన్ని కొనసాగించమని ప్రతిపాదించినప్పటికీ.. డెన్మార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆస్ట్రాజెనెకా టీకా లేకుండానే కొనసాగిస్తామని అక్కడి ఆరోగ్యశాఖ డైరెక్టర్ సోరెక్ బ్రోస్ట్రోమ్ తెలిపారు. డెన్మార్క్లో 1,40,000 మందికి ఆస్ట్రాజెనెకా టీకాలు ఇవ్వగా.. ఇద్దరికి రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. అనంతరం ఇరువురిలో ఒకరు చనిపోయారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm