న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా ఏకంగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,00,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరింది. మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 1,038 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 18న 1,033 మరణాలు సంభవించాయి. రోజులు గడుస్తున్నా.. కేసులు ఏమాత్రం తగ్గకపోగా.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతుండడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. 24 గంటల్లో కొత్తగా 93,528 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,24,29,564 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో భాగంగా 11,44,93,238 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో అమెరికా, మూడో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి. రోజుకు లక్ష నుంచి రోజుకు రెండు లక్షల కేసుల సంఖ్యను చేరుకోవడానికి అమెరికా 21 రోజులు పట్టగా.. భారతదేశం కేవలం 11 రోజుల్లో చేరింది.