24 घंटे चक्कर लगाए, कहीं बेड नहीं!
— Puja Bharadwaj (@Pbndtv) April 14, 2021
बुज़ुर्ग मरीज़ के बेटे की गुहार, ‘या बेड दो या इंजेक्शन देकर मार दो!’
महाराष्ट्र के चंद्रपुर का हाल. pic.twitter.com/ZzxhlnzdZL
ముంబయి: రెండో దశలో కరోనా ఉద్ధృతి..రోగుల పరిస్థితిని దయనీయంగా మార్చేసింది. ఆసుపత్రుల్లో తగిన సమయంలో వైద్యం అందించలేకపోతున్నామనే బాధ రోగుల కుటుంబ సభ్యులను వేధిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి వైద్యం కోసం అతని కొడుకు 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులను తిరిగినా ఒక్క బెడ్ కూడా దొరకని దయనీయమైన దుస్థితి ఏర్పడింది. చివరకు చేసేదేమిలేక ఆస్పత్రిలో చేర్చుకొని బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రోగి కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్లో చోటు చేసుకుంది.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా వీడియోలో.. ఓ తండ్రి అవస్థ చూసి కుమారుడు చేసిన అభ్యర్థన ఆవేదన కలిగిస్తోంది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన సాగర్ కిశోర్ అనే వ్యక్తి తండ్రికి కొవిడ్ సోకింది. లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. తన తండ్రిలాగే చాలామంది చంద్రాపూర్లో ఆసుపత్రి బయట బారులుతీరి ఉన్నారని అక్కడకు వచ్చాకే సాగర్కు తెలిసింది. మరోవైపు, కొవిడ్ బాధితులంతా ఆసుపత్రులకు రావడంతో అక్కడి వైద్యశాలలను 24 గంటలపాటు మూసివేశారు. మరోవైపు అంబులెన్సులో ఉన్న సాగర్ తండ్రి దగ్గుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఇలాగైతే కుదరదని భావించి, పక్కనే ఉన్న తెలంగాణలోని ఆసుపత్రిలో చేర్పించాలనుకున్నారు. ‘నా తండ్రిని తీసుకొని మొదట వరోరా ఆసుపత్రికి వెళ్లాను. తరవాత చంద్రాపూర్లోని మరో వైద్యశాలకు తీసుకెళ్లాను. అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు కూడా పరుగులు తీశాము. ఎక్కడా పడకలు అందుబాటులో లేవు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. తెలంగాణకు వచ్చినా అదే పరిస్థితి ఎదురుకావడంతో మళ్లీ సొంతరాష్ట్రానికే వెళ్లారు. ఒకవైపు దగ్గు, మరోవైపు అంబులెన్సులోని ఆక్సిజన్ లేని పరిస్థితి.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తండ్రిని చూసి తీవ్ర కలతకు గురయ్యారు. 24 గంటల్లో రెండు రాష్ట్రాలు తిరిగినా..ఆయనకు వైద్యం దక్కలేదు. దాంతో ‘నా తండ్రిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అయినా అందించండి లేదా ఇంజెక్షన్ ఇచ్చి ఆయన్ను చంపేయండి. ఇలా నా తండ్రిని మాత్రం ఇంటికి తీసుకెళ్లలేను’ అంటూ సాగర్ అసాధారణమైన అభ్యర్థన చేశారు. కొవిడ్ పరిస్థితులే ఆయన్ను అలా మాట్లాడేలా చేశాయని అక్కడివారు వాపోయారు. మహారాష్ట్రను కరోనా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రోగులకు పడకలు అందుబాటులో లేక, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందులు అందిచలేక ఆ రాష్ట్రం అవస్థలు పడుతోంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం కేంద్రం, సైన్యం సహాయాన్ని కూడా అభ్యర్థించింది.