హైదరాబాద్: మధ్య ప్రదేశ్లో నిన్న ఒక్కరోజే రకార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండడంపై రాష్ట్ర మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వయసు పైబడిన తర్వాత మనుషులు ‘‘చనిపోతారు కదా..’’ అంటూ ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్-19 కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చావులను ఎవరూ ఆపలేరు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సహకరించాలంటూ ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నారు. ప్రతి రోజూ చాలామంది చనిపోతున్నారు అని మీరు అడుగుతున్నారు. ప్రజలు వయసు పైబడితే చనిపోక తప్పదు కదా.. ’’ అని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించామనీ... ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం అవసరం అంటూ చెప్పుకొచ్చారు. కరోనా చికిత్స కోసం తగినంత మంది వైద్యులను కూడా ఏర్పాటు చేశామనీ.. ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన అన్నారు. కాగా బుధవారం మధ్యప్రదేశ్లో 9,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో 51 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 మృతుల సంఖ్య 4,312కి చేరింది. ఈ ఒక్క నెలలోనే మధ్య ప్రదేశ్లో కొత్తగా 67,841 మందికి కరోనా సోకగా... 326 మంది చనిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm