నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్కు ధరించిన వారికే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవిడ్ రోగులకు సాయంత్రం 6 గంటల ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm