హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ తొలిసారి హైదరాబాద్లో జరగనుంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగబోయే ఈ మెగా టోర్నీ వేదికల్లో హైదరాబాద్ కూడా ఎంపికైంది. మొత్తం తొమ్మిది వేదికల్లో టీ20 ప్రపంచకప్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బోర్డు కార్యదర్శి జై షా ఈ విషయం తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్తో పాటు.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ధర్మశాల, లఖ్నవూలు తదితర తొమ్మిది వేదికలలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. 2016 ప్రపంచకప్ ఏడు వేదికల్లో నిర్వహించగా.. ఈసారి అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లఖ్నవూలకు కొత్తగా అవకాశం లభించింది. వేదికల వివరాలను బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ టోర్నీలో పోటీపడేందుకు పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇవ్వనున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా రోజులుగా పాక్ క్రికెటర్లకు భారత ప్రభుత్వం వీసాలు ఇవ్వడంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలు ఇవ్వడానికి సంబంధించి సమస్య పరిష్కారమైందని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm