తాండూరు: కరోనా వైరస్ సోకిందని చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తాండూరు యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అందరి హృదయాలను కలచివేసే ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. వివరాలు.. తాండూరులోని సీతారాంపేట్కు చెందిన హన్మంత్ (31)కు ఈశ్వరితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చెరుకు బండి నడిపిస్తూ హన్మంత్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఈనెల 11వ తేదీన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో హన్మంత్ హోం క్వారంటైన్లోకి వెళ్లాడు. స్థానికుల సూటిపోటి మాటలతో హన్మంత్ను వేధించసాగారు. తన నుంచి కరోనా కుటుంబానికి కూడా సోకుతుందేమో అనే భయంతో శుక్రవారం అర్ధరాత్రి హన్మంత్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాండూరు- కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లి రైలు వస్తోండగా ఎదురుగా వెళ్లాడు. దీంతో రైలు ఢీకొని మృతదేహాన్ని 200 మీటర్ల వరకు లాకెళ్లడంతో పూర్తిగా ఛిద్రమైంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య హన్మంత్ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. తాండూరు యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm