న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తోంది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నది. 24 గంటల్లో 1,619 మంది చనిపోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య కూడా 1,78,769కి చేరింది.
కొత్త కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీ రేటు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కేవలం 1,44,178 మంది మాత్రమే కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,29,53,821 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇచ్చిన టీకాల సంఖ్య 12,38,52,566కు చేరింది.