హైదరాబాద్: పటాన్ చెరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి చెందగా.. వారి మూడేళ్ల కొడుకు అనాథగా మిగిలిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం దద్దోజిపేటకు చెందిన శ్రీధర్ (34)కు, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దీపిక (28)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారు పటాన్ చెరు వచ్చి శాంతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి హనీష్(3) అనే కుమారుడు ఉన్నాడు. దీపిక చెల్లెలు మానస కూడా ఉద్యోగం చేస్తూ వీరి వద్దే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇప్పుడే వస్తామని చెప్పి భార్యాభర్తలిద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ వారిని ఢీకొట్టింది. దీంతో శ్రీధర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన దీపిక ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే ప్రాణాలు విడిచింది. దీంతో అమ్మానాన్నలిద్దరిని కొల్పొయిన హనీష్ అనాథగా మిగిలిపోయాడు. పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm