బీర్కూర్: కరోనా మహమ్మారి కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే తల్లీ, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీనా భర్త మల్లెల హన్మంతు(41), ఆయన తల్లి గంగమణి(70) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హన్మంతు తొలుత బోధన్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం అతను మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో హన్మంతు, మీనా, గంగమణికి పాజిటివ్గా తేలింది. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగమణి ఆదివారం సాయంత్రం మృతి చెందగా.. హన్మంతు సోమవారం ఉదయం మృతి చెందారు. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. వీరిద్దరికీ కొవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm