విజయవాడ: అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడత సాయాన్ని నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. తొలి విడతగా 52.38 లక్షల రైతులకు రూ.3,882.23 కోట్లు సాయం అందించనున్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్ఆర్ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. ఇది మూడు విడతలుగా ఇవ్వనుంది ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ, జనవరి నెలలో రూ. 2,000 జమ చేయనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ప్రతి ఏడాది రూ. 13,500 లబ్ధి చేకూరుతోంది. ఈ డబ్బులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 7,500 ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం(ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం) రూ.6 వేలు ఇస్తోంది. కాగా, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా మరికొంతమంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm