హైదరాబాద్: ప్రాణవాయువు లేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో ఎంతో మంది ప్రాణాలు ఉగ్గపట్టి ఉంటున్నారు. ఆక్సిజన్ అంటే అమృతం కంటే విలువైంది. అయినా కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం వృథా చేసేస్తోంది. ఇలా విజయవాడ రైల్వే ఆస్పత్రి ట్యాంక్లోని దాదాపు వెయ్యి కి.లీల ఆక్సిజన్ వృథాఅయింది. వివరాల్లోకి వెళితే..విజయవాడ ఆటోనగర్లోని ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి ప్రతిరోజూ విజయవాడ రైల్వే ఆస్పత్రికి వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా సరఫరా అవుతుంది. బుధవారం కూడా ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని ఆక్సిజన్ను ఫిల్లింగ్ చేస్తుండగా ఆస్పత్రి ట్యాంక్లో ఏర్పడిన లీక్తో..అదంతా బయటకు ఎగసిపడింది. రైల్వే ఆస్పత్రి ప్రాంగణాన్ని దట్టంగా కమ్మేసింది. ఈ దృశ్యాన్ని చూసిన కొంతమంది భయంతో పరుగులుపెట్టారు. అయితే, నిర్వాహకుల పొరపాటు కారణంగానే ఆక్సిజన్ లీకైందని వైద్యులు తెలిపారు. అయితే, తమ వద్ద అదనంగా ఆక్సిజన్ నిల్వలతోపాటు, కాన్సంట్రేటర్లు కూడా ఉండటం వలన రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఈ ఘటనపై విచారణకు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm