హైదరాబాద్ : కన్న తండ్రే కుమార్తె పట్ల కిరాతకుడిగా మారాడు. కుమార్తె అని కూడా చూడకుండా తన వాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. చివరకు కుమార్తే అతడిని హతమార్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ దివ్యాంగుడు. భార్య మరణం తరువాత ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వెంకటేశ్ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్ తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు. వెంకటేశ్ రెండో కుమార్తె తండ్రిని హత్య చేసిందని అనంతరం దర్యాప్తులో గుర్తించారు. 'నా తండ్రి లైంగికంగా వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశాను' అని ఆమె చెప్పినట్లు డీఎస్పీ ఇళంగోవన్ తెలిపారు. అనంతరం పోలీసులు బాలికను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm