హైదరాబాద్: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోందని, గంజాయిపై యుద్ధం ప్రకటించాలని ఆదేశించారు. పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయి అక్రమ సాగు అరికట్టాలన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎంతో ఆవేదనతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అమాయకులైన యువకులు గంజాయి బారిన పడుతున్నారని, నేరస్థులు ఎంతవారైనా ఉపేక్షించొద్దని కేసీఆర్ ఆదేశించారు. గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారిని నియమించి.. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను బలోపేతం చేయాలని చెప్పారు. విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. సరిహద్దుల్లో చెక్పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. తెలంగాణ పోలీస్కు బెస్ట్ పోలీస్ అని పేరుందని, దాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm