హైదరాబాద్ : విద్యుత్ స్తంభాన్ని ఓ లారీ ఢీకొట్టి దగ్ధమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 02యూబీ 9986 నెంబరు గల లారీ ఇసుక లోడ్ చేసుకొని వరంగల్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో ఆ లారీ మండల కేంద్రంలో బావని వాగు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. దాంతో విద్యుత్ వైర్ తెగి లారీకి తగలడంతో ఇసుక లారీ దగ్ధమైంది. అయితే లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm