హైదరాబాద్ : భారత్ లోనూ ఒమిక్రాన్ ప్రవేశించిందన్న కేంద్రం ప్రకటనతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ లో వెల్లడైన రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 66 ఏళ్ల వయసున్న వ్యక్తి అని, అతడు దక్షిణాఫ్రికా పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటీవలే అతడు తిరిగి దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. మరో వ్యక్తి 46 ఏళ్ల వైద్యుడు అని, ఇప్పుడా డాక్టర్ ను కలిసిన వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన డాక్టర్ కు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని మంత్రి వివరించారు. ఆయనను కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లకు విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, డాక్టర్ సహా వారందరినీ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచామని పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని, వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm